వైభవ్‌ సూర్యవన్షీ ఏ స్కూల్‌లో ఎంత ఫీజ్‌ కట్టి చదువుతున్నాడో తెలుసా? ఐపీఎల్‌ అవ్వగానే.. బ్యాక్‌ టూ స్కూల్‌

by | Jun 5, 2025 | Business, Telugu News

వైభవ్‌ సూర్యవన్షీ ఏ స్కూల్‌లో ఎంత ఫీజ్‌ కట్టి చదువుతున్నాడో తెలుసా? ఐపీఎల్‌ అవ్వగానే.. బ్యాక్‌ టూ స్కూల్‌

వైభవ్ సూర్యవన్షీ, 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో అడుగుపెట్టి సెన్సేషన్‌గా మారాడు. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలోని తాజ్‌పూర్ గ్రామంలోని ముక్తేశ్వర్ సిన్హా మోడెస్టీ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. అతని స్కూల్ ఫీజు, క్రికెట్ శిక్షణ, అతని అద్భుతమైన క్రికెట్ ప్రయాణం గురించి ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం.

వైభవ్‌ సూర్యవన్షీ.. ప్రస్తుతం ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఐపీఎల్‌ ఆడుతున్న అతి పిన్న వయస్కుడిగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రికెటర్‌. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌ ఆడటమే కాకుండా.. 35 బంతుల్లోనే సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. అసలు భయమంటేనే ఏంటో తెలియకుండా బ్యాటింగ్‌ చేస్తూ.. భవిష్యత్తు నాదే అంటూ గర్వంగా చెప్పకనే చెబుతున్నాడు. ఐపీఎల్‌ 2025 కోసం జరిగిన మెగా వేలంలో కోటి 10 లక్షలకు ఈ కుర్రాడిని రాజస్థాన్‌ రాయల్స్‌ సొంత చేసుకున్న విషయం తెలిసిందే. ఆరంభ మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం రాకపోయినా.. ఒక్కసారి ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి వచ్చాకా.. తన సత్తా ఏంటో చూపించాడు. తన ఐపీఎల్‌ కెరీర్‌లో తొలి బంతికే సిక్స్ కొట్టాడు.

ఆ తర్వాత తన మూడవ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లో సెంచరీ చేశాడు. ఐపీఎల్‌ చరిత్రలోనే ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ఇండియన్‌ ప్లేయర్‌గా కొత్త చరిత్ర లిఖించాడు. తాజాగా ఆదివారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కేవలం 15 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సులతో 40 పరుగులు చేసి అదరగొట్టాడు. అయితే.. ఐపీఎల్‌లో దుమ్ములేపుతున్న ఈ కుర్రాడు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాడని తెలిసి అంతా షాక్‌ అయ్యారు. ఇంతకీ వైభవ్‌ సూర్యవన్షీ ఏ స్కూల్‌లో చదువుతున్నాడు? ఎంత ఫీజ్‌ కడుతున్నాడు? అనే ఇంట్రెస్టింగ్‌ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. వైభవ్ బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలోని తాజ్‌పూర్ అనే చిన్న గ్రామంలోని డాక్టర్ ముక్తేశ్వర్ సిన్హా మోడెస్టీ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు.

అంజలి కేవత్ ముక్తేశ్వర్ సిన్హా మాడెస్టీ స్కూల్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. వైభవ్ 9 ఏళ్ల వయసులో క్రికెట్ కోచింగ్‌ కోసం కోచ్ మనీష్ ఓజా ఆధ్వర్యంలో పాట్నాలోని జెన్నెక్స్ క్రికెట్ అకాడమీలో చేరాడు. అక్కడ అతను ఉదయం 7.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ పొందేవాడు. ఉదయం 5 నుండి 6 గంటల మధ్య ట్యూషన్‌కు వెళ్లి.. ఆ తర్వాత క్రికెట్‌ కోచింగ్‌కు వెళ్లేవాడు. అయితే ముక్తేశ్వర్ సిన్హా మోడెస్టీ స్కూల్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. 2024-25 సెషన్‌కు వైభవ్ సూర్యవన్షీ స్కూల్ ఫీజు ట్యూషన్ ఫీజు రూ.2,100, పరీక్ష ఫీజు రూ.800, యాక్టివిటీ ఫీజు రూ.2,400 చెల్లిస్తున్నాడు.

కాగా వైభవ్‌ క్రికెట్‌తో పాటు చదువును కూడా కొనసాగించాలని అనుకుంటున్నాడు. కనీసం టెన్త్‌ పాసై ఆ తర్వాత ఓపెన్‌లో మిగతా చదువు పూర్తి చేద్దామని అనుకుంటున్నాడు. వైభవ్ జనవరి 2024లో బీహార్ తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. అప్పుడు అతనికి కేవలం 12 సంవత్సరాల 284 రోజుల వయసు మాత్రమే. చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన భారత అండర్‌19 మ్యాచ్‌లో కూడా అతను పాల్గొన్నాడు. అందులో 58 బంతుల్లో సెంచరీ సాధించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్న వైభవ్‌.. ఐపీఎల్‌ పూర్తి అవ్వగానే తిరిగి స్కూల్‌ ప్లస్‌ క్రికెట్‌ కోచింగ్‌ కొనసాగించనున్నాడు.